హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ కమిటీలో అంశంగా చేర్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బీసీల జనాభా సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బీసీ స్కిల్స్ను మరింత పదును పెట్టేందుకు 100 ఎకరాల్లో ఫూలే పేరిట బీసీ ఆత్మగౌరవ భవన్ను ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం, ఎలెక్టెడ్, సెలెక్టెడ్ పోస్టుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. 31 జిల్లాల్లో రెండేసీ చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. ప్రతి జిల్లాల్లో నిరంతరంగా కోచింగ్ సెంటర్లు కొనసాగుతాయని, ర్యాంకులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఫీ రీఎంబర్మెంట్ కల్పించాలని, కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాన్ని పెంచాలని ప్రతిపాదించనున్నట్లు జోగు రామన్న తెలిపారు.