హైదరాబాద్, డిసెంబర్ 10 : భారత పౌరుడిగా దేశానికి సేవా చేయడం కోసం మంచి జీతంతో అమెరికాలో ఉద్యోగం ఆఫర్.. మరోవైపు ఐఐఎం నుంచి వచ్చిన పిలుపును వదులుకున్న ఓ యువకుడు ఎందరో విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచాడు. అతనే బర్నాన యాదగిరి, పేదరికంలో పెరిగిన ఈ యువకుడి తండ్రి గున్నయ్య హైదరాబాద్లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పనికి వెళ్తే కానీ రోజు గడవని పరిస్థితి. కానీ కష్టాలు పడిమరి కొడుకును చక్కగా చదివించాడు. తల్లిదండ్రులను పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పరిస్థితులను అధిగమించి బర్నాన హైదరాబాద్లోని ఐఐఐటీలో విద్యనభ్యసించాడు. అనంతరం అతడికి యూఎస్కి చెందిన ఓ పెద్ద కంపెనీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అంతేకాదు.. క్యాట్ ఎగ్జామ్లో 93.4శాతం మార్కులు సాధించడంతో ఇండోర్లోని ఐఐఎంలో సీటు సాధించగలిగాడు. కానీ ఈ రెండు ఆఫర్లను బర్నాన పక్కన పెట్టాడు. తన దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుని ఆర్మీలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ నెల 9న డెహ్రడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో అత్యున్నత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న అతడిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో గర్విస్తున్నారు. ఈ సందర్భంగా బర్నాన మాట్లాడుతూ..‘మా నాన్న రోజువారీ సంపాదన రూ.60. అమ్మ పోలియోతో బాధపడుతుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరాను. మాతృదేశానికి సేవ చేయడం ద్వారా పొందే మానసిక సంతృప్తిని ఏ డబ్బుతో భర్తీ చేయలేమని ఆ యువకుడు ఆనందం వ్యక్త పరిచాడు.