మూసాపేట, డిసెంబర్ 06 : చదువు ఒత్తిడితో విద్యకుసుమాలు నేలరాలిపోతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో తల్లిదండ్రులుకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లో నివాసముంటున్న స్వరూప్, కవితల కుమార్తె ప్రియాంక(18) , షేక్పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతుంది. పరీక్షల్లో తప్పడం వల్ల, ఆత్మనూన్యత చెందడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతే కాకుండా చనిపోయే ముందు ఆమె స్వహస్తాలతో రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చదువు కోసం తల్లిదండ్రులు ఏటా రూ. 11 లక్షలు ఖర్చు చేస్తున్నారని రాసి ఉంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.