హైదరాబాద్, డిసెంబర్ 04 : ఈ నెల 20 వ తేదీ వరకు భాగ్యనగరాన్ని బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చేందుకు స్పెషల్డ్రైవ్ చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. గ్లోబల్ సమ్మీట్ సదస్సుకు ముందు ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్ ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యింది. ఇక నుండి యాచకులు ఎవరైనా రోడ్డు మీద బిక్షాటన చేస్తూ కనిపిస్తే సమాచారం అందించిన వారికి 500 నజరానా ఇస్తామని ప్రకటించారు. యాచకులు జైళ్ల శాఖ ఆధీనంలోకి వచ్చాక వారి ఇష్ట ప్రకారం ఇళ్లకు వెళ్లాలనుకున్నా, ఆశ్రమంలో ఆశ్రయం పొందాలనుకున్న వారికి అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ అధికారులతోపాటు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొననున్నారు.