సిద్ధిపేట, జూన్ 14 : సిద్ధిపేట జిల్లా పరిధిలోని కుక్కునూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరర్రెడ్డి బుధవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో తలపై కాల్చుకోవడంతో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్రెడ్డి 2012లో ఎస్ఐగా ఎంపికయ్యారు. 2016 ఆగస్టు 26న ఆయన కుక్కునూరుపల్లి పీఎస్లో ఎస్ఐగా విధుల్లో చేరారు. గతంలో ఆయన మల్కాజ్గిరి, శామీర్పేట, కౌడిపల్లి పోలీస్స్టేషన్లలో పనిచేశారు. కుక్కునూరుపల్లి పోలీస్స్టేషన్లో సంవత్సరం లోపే ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్యకు పాల్పడటం పోలీసులలో చర్చనీయాంశమైంది. 2016, ఆగస్టు 16న రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన స్థానంలో ప్రభాకర్రెడ్డి అదేరోజు విధుల్లో చేరారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ప్రభాకర్రెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం.