తూర్పుగోదావరి, జూన్ 13 : డబ్బు వల్ల ప్రాణ స్నేహితుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరగడం, మితిమీరి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు లేకపోలేదు. అలాంటి సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తూ గో జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో ఉంటున్న పల్ల సత్యనారాయణమ్మ చీటి వ్యాపారం చేస్తుండేది. అదే గ్రామానికి చెందిన కొప్పన వెంకటలక్ష్మి కొన్నాళ్ల క్రితం సత్యనారాయణమ్మ వద్ద చీటి వేసి నాలుగు లక్షలకు పాడుకుంది. ఆ డబ్బులు ఎన్ని రోజులైనా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వెంకటలక్ష్మిని సత్యనారాయణమ్మ తన ఇంటికి పిలిపించింది. అప్పటికే సిద్ధం చేసుకొన్న సలసలా కాగే నూనెని వెంకటలక్ష్మిపై పోసింది. బాధతో వెంకటలక్ష్మి కేకలు పెడుతుండగానే, కత్తితో మెడపై నరికింది. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే వెంకటలక్ష్మి చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేస్కుని దర్యాప్తు చేస్తున్నారు.