విషాదాంతమైన వృద్ధ జంట జీవితం...

SMTV Desk 2017-11-26 13:14:23  old couple, suicide, rajanna sirisilla updates

వేములవాడ, నవంబర్ 26: జీవిత చరమాంకంలో వారసులు, ఆదరించే వారు ఎంత అవసరమో మరో స౦ఘటన రుజువు చేసింది. చేరదీసేవారు లేక జీవితంపై విరక్తి పుట్టి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన ఎడుమ్యాకల నర్సయ్య(69), మల్లమ్మ(60) దంపతులకు సంతానం లేదు. కూలీ పనులు చేసుకుంటూ.. ఇతరులను చేయి చాచకుండా జీవిస్తున్నారు. ఇంతలోనే వారిని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మల్లమ్మకు మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించగా వేలాది రూపాయలు ఖర్చయ్యాయి. నర్సయ్య సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పట్టించుకునేవారు లేక.. బాధలకు తాళలేక నర్సయ్య, మల్లమ్మలు శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు గోడపై నుంచి చూడగా వారు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడికి వచ్చిన వారి మనసులను కలచివేసింది.