హైదరాబాద్, నవంబర్ 25: మాతృ దేవో భవ.. పితృ దేవో భవ.. ఆచార్య దేవో భవ.. అనే నానుడి అందరికీ తెలిసిందే. మన సమాజం తల్లిదండ్రుల తర్వాత, అంతటి ప్రాధాన్యం గురువులకు ఇస్తుంది. కానీ నేటి సమాజంలో కీచక గురువులు నానాటికి పెరిగిపోతున్నారు. ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థినిపై దురాగతానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈసీఐఎల్ ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2 ప్రిన్సిపల్ కె. మహాపాత్ర(54), గత అక్టోబరు 10న మధ్యాహ్నం తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని తన క్యాబిన్కు పిలిచాడు. తలుపులు మూసి బాలికను ముద్దు పెట్టుకున్నాడు. బాలిక కేకలు వేయడంతో వెంటనే తలుపులు తెరిచాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు పెట్టించుకొని పంపించి వేశాడు. కానీ బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహాపాత్రను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.