హైదరాబాద్, నవంబర్ 22: రాష్ట్ర పురపాలక,పరిశ్రమ,ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ లోని ముషీరాబాద్, సనత్ నగర్, అంబర్ పేట్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలలో హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి పర్యటించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సులో బయలుదేరిన మంత్రి మొదట బన్సీలాలపేట లో జీహెచ్ ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను సందర్శించారు. ఈ కమ్యూనిటీ హాల్ ను ఆదర్శంగా తీసుకుని ఇతర చోట్ల ఇలాంటివి నిర్మిస్తే పేద ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుకలుతుందని, హాల్ నిర్మాణం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రత్యేక కృషికి అభినందనలు తెలిపారు. తర్వాత పలు నాలాలను, దోమల్ గూడా సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన ఇక్కడ నూతన కార్యాలయ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులకు అదేశించారు. ఇలా మూడున్నర గంటల పాటు ఆయన సుడిగాలి పర్యటన చేశారు.