హైదరాబాద్, నవంబర్ 21 : భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్ట్ మెట్రో మరో రికార్డు ను అందుకోబోతుంది. ఇప్పటికే దేశంలో చాలా నగరాల్లో మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 30 కి.మీ.ల అతి పొడవైన మార్గం తొలివిడతలోనే ప్రారంభిస్తుండటం దేశంలో మొదటిసారి మన నగరంలోనే జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న ఢిల్లీ మెట్రో రికార్డు 22 కి.మీ.ను మన నగరం అధిగమించబోతుంది. ఈ నెల 28 న హైదరాబాద్ మెట్రో ఈ ఘనత దక్కించుకోనుంది.మియాపూర్ నుంచి అమీర్పేట మీదుగా నాగోల్ వరకు మార్గానికి కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సెఫ్టీ(సీఎంఆర్ఎస్) భద్రతా ధ్రువీకరణ సోమవారం రావడంతో ప్రయాణికులకు అనుమతి ఇచ్చేందుకు అడ్డంకులు తొలగాయి. సాధారణంగా పౌరులు మెట్రోలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సుముఖత చూపిస్తారు. కనుక నగరంలో 30 కి.మీ. మార్గానికి సంబంధించిన పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు.