హైదరాబాద్, నవంబర్ 21: నవంబర్ 28 నుండి 30 వరకు హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ఈ సదస్సుకు హాజరవుతుండడంతో భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఇవాంకా బస చేసే వేస్టిన్ హోటల్ నుంచి హెచ్ఐసీసీ ప్రాంగణానికి మధ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో యాచకుల పై నిషేధం విధించిన అధికారులు, రోడ్ల ప్రక్కన జరిగే వ్యాపారాలపై దృష్టి పెట్టారు. భద్రతా విషయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 127 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ట్రంప్ కూతురు ఇవాంకా ఈ సదస్సులో పాల్గొననుండడంతో అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.