హైదరాబాద్, నవంబర్ 19 : గతంలో జరిగిన ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. నేడు సోమాజిగూడలోని ప్రెస్క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల ఐకాసతో కోదండరాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ....తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు న్యాయవాదులు ఉద్యమం విషయంలో సహాయసహకరాలు అందిచారని, అలాగే జరిగిన అన్యాయాన్ని కోర్టుల్లో వివరించింది కూడా వారేనని ఆయన అన్నారు. వారంతా సంఘటితమైతే డిమాండ్ల గురించి అడగవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ న్యాయవాదులకు సహాయం, సహకారం రెండూ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశాలపై గతంలో హామీలు ఇచ్చిందని, ప్రస్తుతం అవి సాధించుకునే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే 41 సీఆర్పీసీని రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదుల ఐకాస కన్వీనర్ కొండారెడ్డి అన్నారు.