హైదరాబాద్, అక్టోబర్ 20 : ఓ వైపు సుప్రీంకోర్టు కేసు, మరో వైపు శీతాకాల సమావేశాల నేపథ్యంలో తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు(టీఆర్టీ) ప్రకటన ఈనెల 21 లేదా 22వ తేదీన వెలువడనుంది. 2016 సెప్టెంబర్ నాటి ఖాళీలకు అనుగుణంగా 8,792 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వ్రాత పరీక్షల్లో తెలంగాణ సంబంధిత అంశాలకు ప్రాధాన్యమిస్తూ జనరల్ స్టడీస్ కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీపై సుప్రీం కోర్టులో గత ఏడాదికాలంగా కేసు ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 23న మళ్లీ విచారణకు రానుంది. జులైలో జరిగిన విచారణ సందర్భంగా ఖాళీల భర్తీకి కొంత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే పలు మార్లు గడువు కోరినందున సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూనే వచ్చే విచారణ లోపు భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో 23న విచారణకు రానున్నందున ఇటీవలే అభ్యర్థుల విద్యార్హతలపై విద్యాశాఖ జీవో జారీ చేసింది. ప్రకటన జారీకి టీఎస్పీఎస్సీ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈనెల 21 లేదా 22న టీఆర్టీ ప్రకటన జారీ చేయనున్నారు. దాంతో ప్రకటన జారీ చేశామన్న విషయాన్ని న్యాయస్థానంలో విద్యాశాఖ చెప్పుకోనుంది.