హైదరాబాద్, అక్టోబర్ 13 : మారిన పరిస్థితుల కనుగుణంగా ప్రజల ఆహరపుటలవాట్లు కూడా మార్పు చెందుతుంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా పోషకాహారం పట్ల వైద్యులు, శాస్త్రజ్ఞులు దృష్టి నిలపటం, వారి సలహాల మేరకు తినే పదార్ధాల పట్ల ప్రజలు ఎంపిక కనబరుస్తున్నారు. ప్రస్తుతం కోడి గుడ్డులో ఉండే పోషక విలువల మూలంగా చాల మంది దీనికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వం సైతం విద్యార్ధుల కోసం వసతి గృహాలలో దీనిని ఒక క్రమ పద్ధతిలో బాలబాలికలకు అందేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో గుడ్డు పట్ల విముఖత కనబరిచే వారు సైతం వైద్యుల సలహాపై దీనిని తమ ఆహారపు వస్తువులలో ఒకటిగా చేసుకుంటున్నారు. గుడ్డును పోషకాహారంగా చూస్తే ప్రోటీన్లు, విటమిన్లు, మాంసకృత్తులు, కాల్షియం, జింకు, ఇనుము, ఫోలిక్ యాసిడ్ వంటివి ఇందులో లభిస్తాయి. జంతు మాసం కన్నా పలు రకాలుగా ఇది అందుబాటులో ఉండటమే గాక ఆరోగ్యం పెంపొందేందుకు దోహదం చేస్తుంది. నేడు పాలు, పప్పు, మాంసాహారం వంటివి సైతం కొందరికి అందుబాటులో ఉండటంలేదు. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలు, దీనిని ఉపయోగించటం వారికి మేలు చేస్తుంది. ఫారామ్ కోడి గుడ్డైనా, నాటు కోడి గుడ్డుయినా పోషకాహార విషయంలో పెద్ద తేడా ఉండదు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) గుడ్డు తినటం వలన పలు శారీరక ప్రయోజనాలున్నాయని ఎప్పటినుంచో వివరిస్తోంది. పండ్లు కూరగాయలలో లభించని ప్రోటీన్లు కూడా ఇందులో వుండటం మనం గుర్తించాలి.