హైదరాబాద్, అక్టోబర్ 10 : కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరికి నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. బోర్డు పనితీరుపై పూర్తి అసంతృప్తితో లేఖ రాస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బోర్డు సమర్ధవంతంగా పని చేయకపోగా, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని హరీశ్ ఆరోపించారు. ఆంధ్రపదేశ్ కు అనుకూలంగా వ్యవహరించడం భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు నీటి విడుదల విషయంలో బోర్డు విఫలమైందని తద్వారా సాగర్ ఆనకట్టకు నీరు అందక పోగా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అధికంగా నీరు తీసుకుందని అన్నారు. పౌర గ్రిడ్ అవసరాల కోసం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తికై తెలంగాణ నీరు తీసుకుంటే దీన్ని బోర్డు ఉల్లంఘనగా పరిగణించడం సారి కాదన్నారు. ఇదే సమయంలో కేటాయించిన 5టీఎంసీలా కంటే ఎక్కువ నీరును పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రపదేశ్ తీసుకుందని మంత్రి తెలిపారు. నీటి విడుదల ఉత్తర్వుల విషయంలోనూ బహు బోర్డు పక్షపాత ధోరణి కనబరుస్తుందని, హైదరాబాద్ తాగునీరు అవసరం కోసం 2టీఎంసీల నీటిని ఆగస్టు 29న కోరితే, సెప్టెంబర్ 11న అనుమతించారని మహబూబ్నగర్, ఖమ్మం,నల్గొండ 15టీఎంసీలు కావాలని సెప్టెంబర్ 27న కోరితే ఇప్పటికి స్పందించలేదని తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ వివరాలు తారుమారు చేశారని, దీంతో చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. .