వరంగల్, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం భూ సంబంధిత ప్రతిపాదనలను వేగవంతం చేస్తుంది. గత కొంతకాలంగా తాత్సారానికి గురైన రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరకనుంది. ఆదివారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ లో జరిగిన భేటీలో భూరికార్డుల ప్రక్షాళన ప్రత్యేక అధికారి వాకాటి కరుణ మాట్లాడుతూ..... రైతుల వ్యవసాయ భూ సంబంధిత పత్రాలను ప్రక్షాళన చేస్తున్నామని, దీని వల్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమం వీలైనంత త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంగా అధికారులు సమన్వయము తో పనిచేయాలని, దీనివల్ల రికార్డుల నిర్వహణ తేలికకావడమే కాకుండా రైతులకు తమ భూమి పట్ల స్పష్టత ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ఒక్కో గ్రామంలో 10 రోజులకు పైగా పని చేయాలని, గ్రామాలకు వెళ్ళే ముందు టీం నాయకుని ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతిరోజూ జరిగిన పనుల గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమం వల్ల భూమి, రైతుల ఖాతాల, ప్రభుత్వ ఆస్తుల వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయాకర్, రూరల్ జిల్లాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.