ముంబై, అక్టోబర్ 4 : ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలను తీసే పనిలో బాలీవుడ్ నిమగ్నమైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కథానాయకులు, నాయికలు ప్రముఖుల బయోపిక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. పరుగుల రాణి పీటీ ఉష జీవితకథ ఆధారంగా దర్శకురాలు రేవతి ఎస్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి గాను బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ప్రియాంక "బాక్సర్ మేరీకోమ్" బయోపిక్ లో నటించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం విదితమే. కాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను సంప్రదించినట్లు సమాచారం.