హైదరాబాద్, సెప్టెంబర్ 17 : క్షీర విప్లవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త నిర్ణయానికి నాంది పలికారు. ప్రతి ఏడాది తగ్గిపోతున్న పాల నిల్వలను పెంపొందించడమే లక్ష్యంగా కేసీఆర్ "ఇంటికో గేదె" అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షీర విప్లవం ద్వారా అధిక పాల దిగుబడులను సాధించాలని రైతులకు సూచించారు. ఇందు నిమిత్తం పాడి రైతులకు 50 శాతం సబ్సీడితో గేదెల పంపిణీ చేయనున్నామని, ఇంతకు ముందు పంపిణీ చేసిన గొర్రెల పంపకం వలే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దాదాపు ఏడు లక్షల మంది యాదవులకు ఈ గేదెలను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కాగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ గేదెల కొనుగోలులో 75 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు.