హైదరాబాద్, సెప్టెంబర్ 14 : "మజ్నూ" సినిమాతో వెండితెరకు పరిచయమై మంచి హిట్ అందుకున్న హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, తన రెండవ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కాని ఒక్క అవకాశం పూర్తిగా ఆమె జాతకాన్నే మార్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్డంను అనుభవిస్తోంది. అనూతో నటించడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ దర్శకత్వంలో హీరోయిన్ గా అనూను ఎంపిక చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన తరువాతి సినిమాలో అనూనే తీసుకోవాలని భావిస్తున్నట్లు సినీవర్గాల టాక్. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ హీరోయిన్ నే తీసుకోవడానికి చిత్రబృందం ఆసక్తి చూపుతున్నారు. ఇలా అగ్ర దర్శకులు, కథానాయకులు ఒక్కసారిగా ఆమెపై దృష్టి సారించడంతో అనూ ఇమ్మాన్యుయేల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.