హైదరాబాద్ సెప్టెంబర్5: నేడు గణేష్ నిమజ్జనోత్సవం కావడంతో, హైదరాబాద్ లో వాహనాలన్నీ ట్యాంక్ బ్యాండ్ వైపే తరలి వెళుతున్నాయి. వివిధ కాలనీలకు చెందిన గణేష్ లతో ప్రజలంతా ఆట పాటలతో హోరెత్తిస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ జన సంద్రంగా మారిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులంతా కూడా ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను కూడా దింపడం జరిగింది. అయితే ఈ నిమజ్జన కార్యక్రమం నేడు సాయంత్రానికి పుంజుకొని, రేపు ఉదయం కల్లా ముగుస్తుంది. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలివస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో యువత నిమజ్జన వేడుకల్లో పాల్గొంటోంది. భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.