హైదరాబాద్, సెప్టెంబర్, 1 : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన లవాదేవీలను జారీ చేయడం జరిగింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ, కేంబ్రిడ్జి గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేటు, నాన్ ఎయిడెడ్ పాఠశాలలు ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ సర్కార్ పేర్కొంది. గత మూడేళ్ల లావాదేవీలతో పాటు తెలంగాణ పాఠశాలలో పాటించే లవాదేవీలు ఫీజుల విధానాలను కూడా వెబ్సైట్లో పొందుపరచాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గడువు తేదీని సెప్టెంబర్ 15 గా ప్రకటించడం జరిగింది. ఈలోగా వివరాలు పొందుపరచలేని పాఠశాలలపై చర్య తీసుకోనున్నట్లు తెలిపింది. www.cdse.telangana.gov.in ఈ వెబ్సైట్లో పాఠశాలలు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఈ నేపథ్యంలోనే ప్రైవేటు స్కూళ్ల అజమాయిషీని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ ఉత్తర్వులకు సంబంధించిన వివరాలు ఇంకా కొన్ని పాఠశాలలకు చేరనేలేదు. దీంతో ఈ వెబ్ సైట్ పొందుపరిచే వివరాలు సరైనవో, కావోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.