అమరావతి, ఆగస్టు 07: ఇటీవల టమాటా ధరల పెరుగుదలపై ఉత్తరప్రదేశ్లో నిరసన తెలుపుతూ టమాటా బ్యాంక్ ను ప్రారంభించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వినూత్న నిరసన రక్షాబంధన్ సందర్భంగా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళలు రఘువీరా రెడ్డికి రాఖీలను కట్టారు, బదులుగా ఆయన మహిళలకు టమోటాలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి రాఖీలను, సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ నేతలు పంపించారు. ఈ నేపధ్యంలో రాఖీతో నిరసన అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రఘువీరా రెడ్డి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈవిధమైన నిరసన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ నిరసనలో పాల్గొని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధానికి రాఖీలను పంపాలని ఈ మేరకు ఆయన కోరారు.