హైదరాబాద్, ఫిబ్రవరి 05: కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీవేటు పడింది. జయరామ్ ను హత్య చేసిన తరువాత, మృతదేహాన్ని తెలంగాణ దాటించేందుకు హైదరాబాద్ కు చెందిన పోలీసు అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని వారి సూచనలతోనే, తాను రాత్రిపూట కారులో జయరామ్ మృతదేహంతో నందిగామ చేరుకున్నానని పోలీసుల విచారణలో రాకేశ్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం.
ఈ హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రాకేష్ రెడ్డి తనతో మాట్లాడిన విషయాన్ని మల్లారెడ్డి కూడ ఒప్పుకొన్నాడు. కానీ జయరాం ను హత్య చేసిన విషయం మాత్రం తనకు తెలీదని ఏసీపీ మల్లారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్నీ నందిగామ పోలీసులు కమిషనర్ కు వివరించారు. దీంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీవేటు పడింది. ఆయన స్థానంలో గాంధీ నారాయణను నియమించారు.