హైదరాబాద్, ఆగష్టు1: గత రెండేళ్ల క్రితం సక్సెస్ అయిన ఓ సినిమా కాంబినేషన్ తో మరో మూవీయట. ఒక కాంబినేషన్ హిట్ అయితే... అదే కాంబినేషన్ తో సినిమాలు రావడం మన చిత్ర సీమకు అలవాటే. కొంతకాలం వరకు ఈ ఫార్ములా సీనియర్ హీరోలకే వర్తించేది. కాని ఇప్పుడు కొత్త హీరోతో సినిమా తీసి సక్సెస్ అయితే... ఆ హీరో, డైరెక్టర్ ల వెంట పడుతున్నారు. ఇప్పుడు సీనియారిటీకన్నా సక్సెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారే ఎక్కువ. ‘కుమారి 21ఎఫ్’కి దర్శకుడు సుకుమార్ కథ అందించగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాతకాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఇదే కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందట. సుకుమార్ రైటింగ్స్, రేష్మాస్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించనున్న ఈ చిత్రాన్ని విజయప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్కుమార్ లు నిర్మిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ వైవిధ్యమైన కథ అందించారని, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.