హైదరాబాద్, జనవరి ౩౦: హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో అవార్డును సొంతం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ కనెక్టివిటీ, పనితీరు, నాణ్యతా ప్రమాణాలు, అత్యుతమ సేవల పట్ల ప్రజలు ఆకర్షితులు కావడంతో రోజు రోజుకీ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనివల్ల హైదరాబాద్ మెట్రో సంస్థకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దేశంలోకెల్ల అత్యుత్తమమైన, అసాధారణమైన పబ్లిక్ ప్రైవేట్ సంస్థగా హైదరాబాద్ మెట్రోకు అవార్డు లభించింది.
హైదరాబాద్ మెట్రోను, రైల్ అండ్ మెట్రో అవార్డ్స్ సెర్మనీ-2019లో రైల్ అనాలసిస్ ఇండియా సంస్థ ఈ అవార్డు కి ఎంపిక చేసింది. నిన్న డిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ఇండియా చైర్మన్ అశోక్ గోయల్ చేతుల మీదుగా ఎల్&టి మెట్రో ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ.నాయుడు ఈ అవార్డును అందుకున్నారు.