హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ పంచాయతి ఎన్నికల సందర్భంగా మూడు దశలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో నేటి నుండి ఈ నెల 9 వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటిదశలో 30 జిల్లాలోని 4,480 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబడతాయి. జనవరి 10వ తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 11న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 12న వాటిని పరిష్కరించి ఆదేరోజున నామినేషన్స్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఆదేరోజు సాయంత్రం అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటిస్తారు.
జనవరి 13 నుంచి 20వరకు అభ్యర్ధులు ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వొంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. జనవరి 21వ తేదీ సాయంత్రమే ప్రత్యక్ష పద్దతిలో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నుకొంటారు. మొత్తం 4,480 గ్రామ సర్పంచ్ పదవులు, 39,832 వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది.