హైదరాబాద్, జూలై 27 : అనిశా వలలో మరో చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ఆదిత్య నగర్లో నివాసముంటున్న తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని పక్క సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో గంగాధర్రెడ్డి ఇంటితో పాటు ఆర్.సి.పురంలోని అతడి కార్యాలయం, హబ్సిగూడ, నిజామాబాద్లోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో నగదు, బంగారం, విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. కాగా అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.