తిరుమల, డిసెంబర్ 18: టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావుకు అభిమానులు తిరుపతిలో ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది హరీశ్రావు సరికొత్త రికార్డులు సృష్టించారు. గత ప్రభుత్వంలో హరీశ్రావు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ సహా పలు శాఖ మంత్రిగా పనిచేశారు.
శ్రీవారిని దర్శనానికి వచ్చిన హరీష్ రావుకు రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. హరీష్ రావుకు పూల దండలు, బొకేలతో అభిమానులు అభినందనలు చెప్పేందుకు పోటీపడ్డారు. మరోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావును వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంలో కలిశి, శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు ఇరువురు నేతలు రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.