అందరి చూపు కెసిఆర్ వైపు

SMTV Desk 2018-12-05 13:23:22  KCR,TRS,

హైదరాబాద్, డిసెంబర్ 05: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సెప్టెంబర్ 6 న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీని రద్దు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 7 న తొలి ఆశీర్వాద సభను నిర్వహించిన కేసీఆర్ ఆ తరువాత కొన్ని రోజుల వరకు ప్రచారానికి దూరంగా ఉన్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం నిర్విరామంగా ప్రచారం చేసారు.

ప్రచారానికి కొన్ని రోజుల గడువున్న సమయంలో ప్రచారం పునఃప్రారంభించిన కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు 110 నియోజకవర్గాల సభలలో ప్రసంగించారు. వొక్కొక్క సభతో రెండు మూడు నియోజకవర్గాలను కవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు 6 సభలకు తగ్గకుండా ప్రచారం చేసిన కేసీఆర్ ఆఖరి రోజు ప్రచారాన్ని కేవలం స్వంత నియోజకవర్గం గజ్వేల్‌కే పరిమితం చేసాడు. దీనితో ఈరోజు కేసీఆర్ ఏం ప్రసంగిస్తారా అనే అంశంపై రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆసక్తి ఎదురుచూస్తున్నది. చివరి సభ కావడంతో కేసీఆర్ దాదాపు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉంది.