నిర్మల్ , నవంబర్ 25: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం వరంగల్ జిల్లా పరకాలలో ఆ తరువాత నిర్మల్ జిల్లా విశ్వనాధ్ పేటలో బహిరంగసభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగేళ్ల సిఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రెండు కారణాలున్నాయి. 1. తన కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు. 2. లోక్ సభతో కలిపి శాసనసభ ఎన్నికలకు వెళ్ళినట్లయితే మోడీ ప్రభంజనం తట్టుకొని గెలవలేమనే భయంతో. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజానల కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన తెలంగాణ ప్రజలపై లక్షల కోట్లు అధనపు భారం మోపారు. ఆయనకు తెలంగాణలో రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుద్యోగుల గురించి చింతలేదు. తన కొడుకు, కూతురు భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు.”
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం అలాగే రైతులు వ్యవసాయం కోసం చాలా చాలా చేశామని కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నట్లు విన్నాను. మరి అంతా అభివృద్ధి చేస్తే నాలుగేళ్లలో 4,000 మందికి పైగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు? ఆయన స్వంత నియోజకవర్గం గజ్వేల్ లోనే 130 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు? నిర్మల్ పరిసర ప్రాంతాలలో వొకప్పుడు అరడజనుకు పైగా పరిశ్రమలు ఉండేవి. అవన్నీ నేటికీ మూతపడి ఉన్నాయి. ఆ పాపం ఎవరిది?" అని అమిత్ షా ప్రశ్నించారు