హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఈ నెల 25న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరకాల, నిర్మల్, దుబ్బాక, మేడ్చల్ పట్టణాలలో ఎన్నికల ప్రచార సభలలో హాజరుకానున్నారు. తరువాత ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. తరువాత ఈనెల 28న అమిత్ షా ఆదిలాబాద్, హైదరాబాద్లో హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, చౌటుప్పల్, తదితర ప్రాంతాలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. మళ్ళీ పోలింగుకు ముందు అంటే డిసెంబరు2వ తేదీన నారాయణ్ పేట్, అమన్ గల్, కామారెడ్డి, ఉప్పల్, మల్కాజ్ గిరిలో బహిరంగసభలు రోడ్ షోలు నిర్వహిస్తారు.
ఆయన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ డిసెంబరు 3వ తేదీన హైదరాబాద్లో బహిరంగసభలో పాల్గొని బిజెపి తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జెపి నడ్డా తదితరులు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలో మరింత మంది కేంద్రమంత్రులు, బిజెపి నేతలు వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ బహిరంగసభలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరగడం ఖాయం.