చంద్రబాబుని కాంగ్రెస్ నేతలు భుజాలపై మోసుకొస్తున్నారు : కేసిఆర్

SMTV Desk 2018-11-22 14:32:26  Chandrababu, chandra shekar rao. congress leaders

దేవరకొండ, నవంబర్ 22: నల్గొండ జిల్లా దేవరకొండ లో నిన్న టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కేసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వాఖ్యలు చేశారు.

“తెలంగాణలో పరాయిపాలన విరగడ అయ్యిందని ప్రజలు అందరూ సంతోషిస్తుంటే, కాంగ్రెస్‌ నేతలు మళ్ళీ చంద్రబాబు నాయుడుని తమ భుజాల మీద ఎందుకు మోసుకువస్తున్నారు? ప్రజలు అందరూ పోరాడి రాష్ట్రం సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతికి ఎందుకు అప్పగించాలనుకొంటున్నారు? తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయనను భుజాల మీద మోసుకువస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు వారితో వాదనకు దిగి బుద్ధి చెప్పాలి.

వొకవేళ పొరపాటున మహాకూటమికి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయని గుర్తుంచుకోవాలి. కనుక మన రాష్ట్రం కోసం...మన అభివృద్ధి, మన సంక్షేమం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తెరాసను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలసిన బాధ్యత ప్రజలదే,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.