హైదరాబాద్ నవంబర్ 21: టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి బుధవారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో కలసి ఆయన రాహుల్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన ఈ సందర్భంగా రాహుల్ కు వివరించారు. ఈ నెల 23న హైదరాబాద్ మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ ల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.
తన రాజీనామాకు ప్రధానంగా 5 కారణాలను పేర్కొన్నారు. కానీ వాటిలో తెరాసలో తనకు సరైన గుర్తింపు గౌరవం లభించకపోవడం, తన అనుచరుల పట్ల పార్టీ వివక్ష చూపడం, గత రెండేళ్లుగా తెరాస, ప్రభుత్వం రెండూ కూడా ప్రజలకు దూరం అవుతుండటం, పార్టీలో అంతర్గత సమస్యలు అనే నాలుగు కారణాలు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే అసలు కారణం మంత్రి మహేందర్ రెడ్డితో విభేధాలేనని తెలుస్తోంది. ఆ కారణంగా పార్టీలో ఆయన, అనుచరులు వివక్షకు గురవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.