హైదరాబాద్, నవంబర్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెరాస ముషీరాబాద్ టికెట్ పై కాస్త ఆలస్యం చేస్తుంది. ఆ టికెట్ పై ఇద్దరు సీనియర్ నేతల కళ్ళున్నాయి. ఓ పక్క హోం మంత్రి నాయిని, మరోపక్క ముఠా గోపాల్ ఇద్దరూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి దగ్గట్టుగా తెరాస కూడా ఎవ్వరికి ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపుతూ వొచ్చింది. అల్లుడి కోసం నాయిని ఇప్పటికే చాలాసార్లు అధినేత కేసీఆర్ను కలసి లాబీయింగ్ చేశారు. తనకు గానీ, తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి గానీ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే అధినేత ఆయనకు గట్టి హామీ ఇవ్వడం లేదని, అయితే తాను తీసుకోబోయే నిర్ణయం పార్టీకి మేలు చేసేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారట.
మరోపక్క.. ముఠా గోపాల్కు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్ ఈసారీ సీటు తనకే కావాలని అడుగుతుండటంతో కేసీఆర్ ఆయన వినతిని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ముషీరాబాద్లో ముఠా గోపాల్ ప్రభావం చూపగలరని పార్టీ సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. అందుకే గోపాల్ కే సీటు కేటాయించాలని గులాబీ బాస్ నిర్ణయించారని చెబుతున్నారు. నామినేషన్ గడువు దగ్గరపడుతుండటంతో అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించిన కేసీఆర్.. నాయినిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. ముషీరాబాద్ టికెట్ ముఠా గోపాల్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన కేసీఆర్.. నాయినికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఇక కోదాడ సీటు నిన్ననే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్కు గాని, కాంగ్రెస్ను వీడి వస్తారని చెబుతున్న మర్రి శశిధర్ రెడ్డికి గానే కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది.