హైదరాబాద్, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి మరీ దారుణంగా తయారవుతుంది. కూటమిలో భాగమైన పార్టీ నుండి టికెట్ ఆశించిన వారికి పార్టీ నిరాశ మిగిల్చే సరికి ఆ నేతలు పక్క పార్టీకి దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే మాజీ మంత్రి శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈమేరకు ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీకి నాటి నుంచి నేటి వరకు సేవలు చేసిన విధేయులకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. వీటిఫలితమే కాంగ్రెస్కు మూలస్తంభాలైన చెన్నారెడ్డి, వెంకటస్వామి కుటుంబీకులకు పార్టీలో చోటులేకుండా చేయడం సరికాదన్నారు.
అయితే ఇప్పటికే షాద్నగర్ టికెట్ ఆశించి శంకర్రావు భంగపడ్డారు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యచరణ రూపొందిచనున్నామన్నారు. సమాజ్వాదీ పార్టీలో ఆయన చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది