న్యూ ఢిల్లీ, నవంబర్ 15: బుదవారం కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశంలో డిసెంబరు 11వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించారు. అయితే డిసెంబరు 11వ తేదీనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో మోడీ ప్రభుత్వం అంబానీకి వేలకోట్లు లబ్ది కలిగించిందని రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు. దానిపై సుప్రీంకోర్టు కూడా స్పందించినందున కాంగ్రెస్ వాదనకు మరింత బలం చేకూరింది. కనుక మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఈ సమావేశాల తరువాత లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలకు మోడీ ప్రభుత్వం కూడా ధీటుగా జవాబు చెప్పక తప్పదు. కనుక పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలా వాడివేడిగా సాగవచ్చు.