హైదరాబాద్, అక్టోబర్ 27: సిఎం కేసీఆర్, మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు తమ అధికారిక నివాసాలలో పార్టీ సమావేశాలు నిర్వహించుకొంటున్నారని, ఇది అధికార దుర్వినియోగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనాని మహాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాడా వెంకట రెడ్డి, ఎల్ రమణ, దిలీప్ కుమార్ తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్కుమార్కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన ఆయన తెరాస సెక్రటరీ జనరల్ కేశవరావుకు సంజాయిషీ కోరుతూ నోటీసు పంపించారు.
సెప్టెంబర్ 6న శాసనసభ రద్దు చేసినప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత నుంచి దానిని ఖచ్చితంగా అమలుచేస్తున్నారు. మంత్రులు ఎవరూ అధికారిక నివాసాలలో, కార్యాలయాలలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వా వాహనాలను వాడరాదని, ప్రభుత్వ పధకాల అమలులో ఎక్కడా మంత్రులు తమ ఫోటోలు వేసుకోరదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించింది. నేటికీ తెరాస ఆపద్ధర్మ ప్రభుత్వంగా అధికారంలో ఉంది కనుక దాని మంత్రులు తమ అధికారిక నివాసాలలో, కార్యాలయాలలో తెరాస సమావేశాలు జరుపుతుండటం సహజమే. కానీ అది ఎన్నికల కోడ్ కు విరుద్దం కనుక మహాకూటమి నేతలకు ఈ అవకాశం లభించిందని చెప్పవచ్చు.