ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్ శ్రీధర్‌

SMTV Desk 2018-10-26 17:56:02  telangana elections, elections observation, sridhar

నాగర్ కర్నూల్, అక్టోబర్ 26: తెలంగాణలో రానున్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో అన్ని విధాలుగా సక్రమంగా ఉండాలని, ఏ వొక్క పొరపాటు కూడా జరగొద్దని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి అధికారి ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రతి వొక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్, వీవీ ప్యాట్‌లపై పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ట్రబుల్‌ మంగర్స్‌(ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారు) ను బైండోవర్‌ చేయాలని, రిటర్నింగ్‌ అధికారుల తో కలిసి రూట్‌ మ్యాప్‌ను తయారు చేయాలని సూచించారు. ప్రచారంలో లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికల సభలకు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు డీఎస్పీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని, వారి నిర్వర్తించే బాధ్యతలను వీడియోలలో చిత్రీకరించాలని ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. వోటు హక్కు ఉన్న ప్రతి వొక్కరికీ తమ ఇష్టం వచ్చిన వారికే వోటు వేసుకునేలా ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు.

వోటర్లు తమ వోటు హక్కును ప్రశాంతంగా వేసుకోవడానికి రెవెన్యూ అధికారులతో కలిసి వర్ణలేబుల్టీ మ్యాపింగ్‌ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన శాంతిభద్రతల నివేదికను ప్రతిరోజూ ఎన్నికల అధికారికి , కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ప్రతి నియోజకవర్గంలోమూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని, చెక్‌ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు వీడియోలు తీయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. హైపర్‌ క్రిటికల్, క్రిటికల్‌ , నార్మల్‌ పోలింగ్‌ బూత్‌లను వెంటనే గుర్తించాలన్నారు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి వోటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌లను ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల పని తీరు గురించి గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. వోటింగ్‌ మిషన్‌ ,వీవీ ప్యాట్‌ల పనితీరు గురించి తెలియజేస్తూ సందేహ నివృత్తి చేయాలన్నారు.

వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.అనంతరం వీవీ ప్యాట్‌ల పనితీరు గురించి కలెక్టర్‌ శ్రీధర్‌ మాక్‌ పోలింగ్‌ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై అవగాహన ఉండాలి ఈవీఎం, వీవీ ప్యాట్‌ల గురించి ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండి.. క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఎస్పీ సాయిశేఖర్‌ ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చి సమాచారం అడిగిన వోటరుకు వివరాలు సవివరంగా తెలిపేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల మ్యాన్యువల్‌ చదివి ఉండాలని సూచించారు.

జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహులు, పుష్పారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.