వరంగల్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగసభ

SMTV Desk 2018-10-25 13:00:32  KCR, Warangal Meeting, Elections

హైదరాబాద్, అక్టోబర్ 25: ఈనెల 31న వరంగల్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. సభకు ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అప్పగించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని తిమ్మాపూర్, భట్టుపల్లి, జక్కులొద్ది లేదా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో ఈ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది.కడియం శ్రీహరి ఈ నాలుగు ప్రాంతాలను పరిశీలించి ఇవాళ్ళ తన అభిప్రాయం తెలియజేసిన తరువాత సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొంటారు.

నవంబరు 1న ఖమ్మంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ వరకు వరుసగా 100 నియోజకవర్గాలలో సిఎం కేసీఆర్‌ బహిరంగసభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్ళీ ఈనెల 27 లేదా 28వ తేదీలలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు పూర్తయి అభ్యర్ధుల జాబితాను ప్రకటించగానే కాంగ్రెస్‌, టిడిపి, టిజేఎస్, సిపిఐ పార్టీలు కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెడతాయి. మరోపక్క బిఎల్ఎఫ్ కూడా ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తోంది. కనుక ఇక నుంచి రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంటుంది.