హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికలకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.రాష్ట్రస్థాయి నేతలంతా ఇంటింటి ప్రచారంలో తప్పకుండా పాల్గొనాలని టీపీసీసీ కార్యవర్గ సమావేశం లో నిర్ణయించుకున్నారు.
అలాగే నవంబర్ 1నుండి 7 వరకు నియోజకవర్గాల వారి సమావేశాలు నిర్వహించాలంటూ, అటు రాహుల్ గాంధీ పర్యటనపై కూడా సుదీర్గంగా చర్చించుకున్నారు. ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ప్రచారం నిర్వహిస్తాయని, 45 రోజులు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని హస్తం పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే మహాకూటమి ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని ఆయన ప్రశ్నించారు. కూటమి అంటే కేసీఆర్కు భయం పట్టుకుందని అన్నారు. కొంగరకలాన్ సభ తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని పొన్నం విమర్శించారు.