హైదరాబాద్, జూలై 20 : టాలీవుడ్ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ను తాము అరెస్టు చేయడం లేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న అక్రమ డ్రగ్స్ మేరకు బుధవారం రోజున ఎక్సైజ్ శాఖ సిట్ కార్యాలయానికి పూరీని దర్యాప్తు చేయడం కోసం పిలిపించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.30 వరకు కొనసాగిన ఈ విచారణ తర్వాత.. సిట్ కార్యాలయం నుంచి పూరీని బయటకు పంపారు. సాధారణంగా అరెస్టుకు ముందు వైద్య పరీక్షలు చేస్తారు. పూరీ జగన్నాథ్ రక్త నమూనాల సేకరణకు వైద్యులు రావడంతో.. ఆయనను అరెస్టు చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ విషయం తెలిసిన అకున్.. బయటకు వచ్చి పూరీని అరెస్టు చేయట్లేదని, ఈ కేసు విచారణపై ఆయన తమకు సహకరిస్తున్నట్లు అకున్ మీడియాకు స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ పూరీ సమాధానాలు చెప్పారన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, గురువారం శ్యామ్ కె. నాయుడు తమ ఎదుట విచారణకు హాజరవుతారని తెలిపారు.