ఇటీవల టిఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్కు ఖైరతాబాద్ నుంచి టికెట్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. టిఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరు కనబడనప్పుడు ఆయన ఏమాత్రం తొందరపడకుండా, “నేను ఎటువంటి పదవులు ఆశించి టిఆర్ఎస్లో చేరలేదు. బేషరతుగా చేరాను. సిఎం కెసిఆర్ నాకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని శిరసావహిస్తాను,” అని చెప్పారు. అయితే ఈరోజుల్లో ఏ రాజకీయ నాయకుడు ఏదీ ఆశించకుండా రాజకీయాలలో కొనసాగుతారనుకోవడం అవివేకమే. ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టిఆర్ఎస్లో చేరుతునప్పుడు డి.శ్రీనివాస్ కూడా అచ్చు ఇలాగే మాట్లాడారు. కానీ ఆ తరువాత ఆయన రాజ్యసభ సీటు పొందిన సంగతి అందరూ చూశారు. కనుక దానం నాగేందర్ కూడా టికెట్ ఆశించే టిఆర్ఎస్లో చేరారనేది అందరికీ తెలిసిన రహస్యం. మొదట ఆయనకు ఘోషామహల్ టికెట్ ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ తనకు బాగా పట్టున్న ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచే దానం పోటీ చేయాలనుకోవడంతో సిఎం కెసిఆర్ ఆయనకు అక్కడి నుంచే పోటీ చేసేందుకు టికెట్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఇది నిజమో కాదా అనే విషయం టిఆర్ఎస్ అధికారికంగా ప్రకటిస్తేగానే తెలియదు. అయితే దానం నాగేందర్, ఆయన అనుచరులు ఖైరతాబాద్ లో చేస్తున్న హడావుడి చూస్తే ఆయనకు అక్కడి నుంచే టికెట్ ఖరారు అయినట్లు స్పష్టం అవుతోంది. కొత్తగా టిఆర్ఎస్లో చేరిన దానంకు ఖైరతాబాద్ టికెట్ కేటాయిస్తే, మొదటి నుంచి టిఆర్ఎస్లో ఉంటూ ఆ టికెట్ కోసం పోటీ పడుతున్న సుమారు అరడజను మంది నేతలు అలకపాన్పు ఎక్కవచ్చు. అక్టోబర్ 2వ వారంలో కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించిన తరువాత టిఆర్ఎస్లో మిగిలిన 14మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. కనుయాక్ అంతవరకు ఈ సస్పెన్స్ కొనసాగవచ్చు