న్యూ ఢిల్లీ, జూలై 18 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ రోజు ఉదయం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఎస్సీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లో దళిత వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరగా డిప్యూటీ చైర్మన్ కురియన్ సమయం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ ఉదయం హెచ్చరించిన మాయా అన్నంత పని చేశారు. ఆమె రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి ఆమె తన రాజీనామా లేఖను పంపారు.