ముంబై, జూలై 11 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అరుదైన గౌరవం దక్కించుకుంది. సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో అనుష్క మైనవు విగ్రహం రాబోతోంది. ఇప్పటికే ఈ మ్యూజియంలో ఓప్రా విన్ఫ్రే, పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్ హామిల్టన్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. తాజాగా అనుష్క శర్మ మైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే అనుష్క మైనపు విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉందట. అయితే ఇప్పటివరకు ఉన్న విగ్రహాలతో వీక్షకులు కేవలం వాటి పక్కన నిలబడి సెల్ఫీలు మాత్రమే తీసుకోగలుగుతారు. కానీ అనుష్క మైనపు విగ్రహంతో అభిమానులు మాట్లాడొచ్చు కూడా. ఆశ్చర్యపోతున్నారా.! అవును అనుష్క విగ్రహాన్ని ఇంటరాక్టివ్ ఫిగరిన్ పేరిట రూపొందించనున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేయబోయే ఫోన్ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం అనుష్కకు దక్కింది. అలా ఈ ఘనతను సొంతం చేసుకోబోతున్న ఏకైక సెల్రబిటీ అనుష్క శర్మనే కావడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న అనుష్క అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.