హైదరాబాద్, జూలై 9 : ఓ మంచి పుత్రుడిగా, ఓ తండ్రిగా, ఓ భర్తగా, పాలకుడిగా అన్ని విషయాల్లోనూ హిందువులు ఆదర్శంగా చెప్పుకునే శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీచేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తో పాటు డీసీపీలు, ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్త చేయడం అంశాలపై డీజీపీ చర్చించారు. ఇదిలా ఉండగా.. కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అతనిని దేశద్రోహిగా ప్రకటించాలని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రను తలపెట్టారు. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్వామిజీని గృహనిర్భంధించిన పోలీసులు, బయటకు రాకుండా ఏర్పాట్లు చేశారు.