హైదరాబాద్, జూలై 7 : వైవిధ్యభరితమైన కథాపాత్రలు పోషిస్తూ ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకుంటోంది నటి వరలక్ష్మి శరత్కుమార్. కథానాయికగానే కాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం.. కలెక్టర్, పోలీసు అధికారిణి, రాజకీయ నేత, ప్రతినాయిక వంటి భిన్నమైన పాత్రల్లో నటిస్తోంది. అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా లేడీ ఓరియెంట్డ్ సినిమాకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయకుండా ఒక ప్రశ్నార్ధకం గుర్తుతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో వరలక్ష్మి అంధురాలి పాత్రలో నటి౦చనున్నట్లు తెలుస్తోంది. జేకే దర్శకత్వం వహిస్త్తున్న ఈ చిత్రానికి శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒక చిత్రంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కథానాయికలు ఉంటే.. వారికి మనస్పర్థలు వస్తుంటాయి. దీనిగురించి వరలక్ష్మి మాట్లాడుతూ "ఒకే చిత్రంలో ఇతర హీరోయిన్తో కలిసి నటిస్తున్నప్పుడు.. ఆమెకు ఎక్కువ సన్నివేశాలు ఉన్నప్పటికీ నేను ఏమాత్రం బాధపడను. మరో నాయికను చూసి ఈర్ష్య పడను. ఎందుకంటే ఎవరినీ నేను పోటీగా భావించడం లేదు. నాతో కలిసి నటించే మరో హీరోయిన్ను నేను స్నేహితురాలిగానే చూస్తా" అంటూ పేర్కొన్నారు.