హైదరాబాద్, జూలై 4 : శ్రీ రాముడిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు బుక్ కావటంతో పాటు.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన కత్తి.. మరోసారి శ్రీరాముడిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కత్తి మహేష్ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ వ్యాఖ్యలు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరాని నేరం అంటూ పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కారహీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని.. సమాజ సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడిన కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగివచ్చినందుకు అభినందిస్తున్నానన్నారు. రైతు బంధు పథకం ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలని.. పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతోంద౦టూ వాపోయారు. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలన్నారు. ఇందుకు అవసరం అయితే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, వివరాలు.. సూచనలు అందిస్తామన్నారు. అవసరం అయితే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సాయం అందేలా ప్రభుత్వం చూడాలని జానారెడ్డి సూచించారు.