హైదరాబాద్, జూన్ 28 : జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశముందని తెలిపాయి. అలాగే పట్నా హైకోర్టులో జడ్జీగా ఉన్న అజయ్ కుమార్ త్రిపాఠీని ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేయగా, తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాగానే ఆయన తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు. అధికారికంగా సీజేగా రాధాకృష్ణన్ నియమాకం జరిగి బాధ్యతలు స్వీకరించే వరకు రంగనాథన్ తాత్కాలిక సీజేగా కొనసాగుతారు.