హైదరాబాద్, జూన్ 21 : ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. వివిధ రంగాలకి చెందిన ప్రముఖుల జీవితచరిత్రలను సరికొత్తగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో దర్శకనిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతూ అనూహ్యమైన విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని ప్రముఖ నటి మనీషా కొయిరాలా అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అత్యంత శక్తిమంతమైన మహిళగా ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వం. అలాంటి అసాధారణమైన మహిళగా.. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది నా చిరకాల వా౦ఛ" అని పేర్కొన్నారు. అయితే సినీ రచయిత కమలేశ్వర్ కథను దర్శకుడు ఎన్ చంద్ర తెరకెక్కించేందుకు సిద్ధం కాగా పదహారేళ్ల క్రితమే ఆ ప్రాజెక్టు కోసం తాను సంతకం చేశానని మనీషా గుర్తుచేసుకున్నారు. మరి ఇందిరాగాంధీ పాటలో నటించాలన్న తన కోరిక తీరుతుందో లేదో చూడాలి మరి.