హైదరాబాద్, జూన్ 6 : మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ కోటాకు చెందిన సీట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలతో క్రీడాశాఖపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మెడికల్ సీట్ల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్సీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సాట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణతో పాటు బాగ్ లింగంపల్లిలోని సాట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి డి.విమలాకర్ రావు ఇంట్లో ఎసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో 9 మంది సభ్యులు గల కమిటీ నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారమని డీఎస్పీ అన్నారు. ఇంతకు ఈ కేసులో ఎంతమందికి సర్టిఫికెట్లు జారీ చేశారన్న దానిపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు.